కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు మరియు ఆల్ ఇండియా హాండీక్రాఫ్ట్స్ బోర్డులను తక్షణమే పున:రుద్ధరించాలని చేనేత జన సమాఖ్య డిమాండ్ చేసింది. బోర్డులను రద్దు చేసినందుకు నిరసనగా శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట లోని కర్ణ సుబ్బరాయ కళావేదిక వద్ద రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు.
చేనేత జన సమాఖ్య నాయకులు కర్ణ హనుమంతరావు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా కుదేలైన చేనేత రంగం పరిరక్షణకు మూడు సంవత్సరముల పాటు చేనేత ఉత్పత్తులు, హస్తకళల మీద GST చెల్లింపునకు మారటోరియం విధించాలని డిమాండ్ చేశారు.
చేనేత కేంద్రీకృత ప్రాంతాల లో చేనేత ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చేనేత జన సమాఖ్య నాయకులు దేవన హేమ సుందర్ రావు, సజ్జా శ్రీను, వావిలాల దాశరధి, లేళ్ళ భాస్కర్ రావు, గుత్తి సదా శివ రావు, మచ్చ మల్లేశ్వరి, కర్ర వెంకటేశ్వర్లు, గుంటూరు బాల సుబ్రహ్మణ్యం చేనేత కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.