నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యల పరిష్కారానికై రేపు విజయవాడలో జరిగే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఐ.ఎఫ్.టి.యు. అనుబంధ “ఎ.పి. ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం” రాష్ట్ర కమిటీ సభ్యులు కాకర్ల శ్రీను పిలుపునిచ్చారు.
బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫత్తేబాద సెంటర్ లో భవన నిర్మాణ కార్మికుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పి సి ఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇసుక నిలిపివేసి, నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేశారని ఆరోపించారు.
మరో పక్క కరోనా కారణంగా కార్మికుల ఉపాధికి తీవ్రంగా దెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ కార్మికుల కోసం చట్టబద్దంగా ఏర్పడిన బోర్డు ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీరుగార్చాడని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి పెట్టుబడి లేకపోయినా “అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా”బోర్డు నిధులను పక్కదారిపట్టించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులు వెంటనే తిరిగి బోర్డకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనీ, ఇసుక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికై రేపు విజయవాడలో జె.ఎ.సి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు రాటాలు, అశోక్, గణేష్, మహేష్, నాగరాజు,బాలు తదితరులు పాల్గొన్నారు.