కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ఏప్రిల్లో తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు –2020ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 ఆదిలాబాద్ సర్కిల్ అధ్యక్ష, కార్యదర్శులు జాదవ్ నూర్సింగ్, సుద్దాల శ్రీనివాస్లు డిమాండ్ చేసారు.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్ఈ ఆఫీసు ఎదుట నల్లబ్యాడ్జీలతో తమ నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగం రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉందని, విద్యుత్కు సంబంధించి రాష్ట్రాలకున్న అధికారాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్రంగం పూర్తిగా కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లీ పేద, మద్యతరగతి ప్రజలకు ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. విద్యుత్ సంస్థల్లో, పనిలో భద్రత కల్పించడంతో పాటు విద్యుత్ రంగంలో ప్రైవేట్ కంపెనీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేసారు.
ప్రజలకు అన్యాయం చేసే ఈ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వారు విజ్నప్తి చేసారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఖాజా మోయినోద్దీన్, కె.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.