రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ను నిరసిస్తూ ములుగు నియోజక వర్గం లోని ప్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
రాహుల్ గాంధీ పై బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు కు నిరసనగా 25న ఉదయం 10 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు ధర్నా లు దీక్షలు చెప్పట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో, ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధి గొంతు నొక్కి ఆయన్ను ఆపాలనుకోవటం మీ తరం, ఎవరితరం కాదన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటుపై న్యాయపోరాటంతో పాటు రాజకీయంగాను కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని దీనిపై తాము భయపడేదిగానీ, మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేశారు.
ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని భాజపా సర్కార్ నొక్కుతోందని ప్రజాసమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో గళమెత్తే రాహుల్గాంధీని సభనుంచి వెళ్లగొట్టారని పార్లమెంటులో ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేస్తే ప్రజల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. రాహుల్.. బలహీనవర్గాలకు వ్యతిరేకమనే ముద్ర వేయడం దారుణమని.. లలిత్ మోదీ.. నీరవ్మోదీ.. వీరంతా బలహీనవర్గాల వారా అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం పట్టుబడుతున్నందుకే కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు.