సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు కేంద్రం లోని మహా సిమెంట్ ఇండస్ట్రీ యాజమాన్యం స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ‘విన్నపం ఒక పోరాటం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి డిమాండ్ చేశారు.
మేళ్ళచెరువు మండల కేంద్రంలోని మహా సిమెంట్ ఫ్యాక్టరీలో నూతన మైనింగ్ కోసం 623 ఎకరాల భూమిని లీజుకు తీసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ మండల పరిధిలోని విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించాలని, ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించాలని అన్నారు.
సూర్యాపేట జిల్లాలో అత్యధిక సిమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయని, ప్రజలు వారి ఆరోగ్యాన్ని కూడా లేక్కచేయకుండా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నారనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. మహా సిమెంట్ ఫ్యాక్టరీకి 623 ఎకరాల భూమి లీజ్ అంటే మరొకసారి ప్రజా ఆరోగ్యానికి భంగం కలుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
అందుకే నిరుపేదల మనోభిప్రాయం పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతయ్య, మాధవరావు, బిక్షం, వెంకటేశ్వర్లు, వెంకటి, నాగేంద్రమ్మ, హైమావతి తదితరులు పాల్గొన్నారు.