పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఏ ) అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ అధ్యక్ష పదవిని చేపట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. జాతీయ ఒలింపిక్ సంఘం హెడ్గా వ్యవహరించనున్న తొలి ఒలింపియన్, అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణిగానూ ఉష రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. ఐఓఏ అధ్యక్ష పదవికి డిసెంబర్ 10 ఎన్నికలు జరగనుండగా 58 ఏళ్ల ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఉషనే ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మిగిలిన ఆఫీస్ బేరర్ల పోస్టుల కోసం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. మేరీ కోమ్ నాయకత్వంలోని ఐఓఏ అథ్లెటిక్స్ కమిషన్ ఎంపిక చేసిన 8 మంది ‘స్పోర్స్పర్సన్స్ ఆఫ్ ఔట్స్టాండింగ్ మెరిట్’లో ఉష ఒకరు కావడం గమనార్హం.
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో సెకన్లో వందో వంతు తేడాతో కాంస్య పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయిన ఉష.. ఐఓఏ అధ్యక్షురాలిగా ఏకీగ్రీవంగా ఎన్నిక కానుండటం పట్ల బీజేపీ సీనియర్ నేతలు ఆమెకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికవుతున్న సందర్భంగా.. దిగ్గజ గోల్డెన్ గర్ల్, పీటీ ఉషకు అభినందనలు. ప్రఖ్యాత ఐఓఏ ఆఫీస్ బేరర్లుగా ఎన్నిక అవుతున్న మన దేశ క్రీడా హీరోలకు కూడా అభినందనలు. దేశం వాళ్లను చూసి గర్విస్తోంది’ అని క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. పయ్యోలీ ఎక్స్ప్రెస్’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఉషను ఈ ఏడాది జులైలో బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో ఆమె అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యారు. ఆసియా క్రీడల్లో 11 పతకాలు సాధించిన ఉష.. 1986లో సియోల్లో జరిగిన ఆసియా క్రీడల్లోనే 4 పతకాలు సాధించడం విశేషం. 1983 నుంచి 1998 వరకు ఆసియన్ ఛాంపియన్షిప్స్లో14 స్వర్ణాలు సహా 23 పతకాలను ఉష గెలుచుకున్నారు.