36.2 C
Hyderabad
April 25, 2024 22: 46 PM
Slider మెదక్

సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం

#geetamunivercity

సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకువచ్చిన పబ్లిక్ పాలసీలు నాడు పెను మార్పులు తెచ్చాయని ఆయన తెలిపారు. ఉత్తమ పాలసీలు, విజన్ ద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచ అగ్రగామి దేశం అవుతుందని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో యువ శక్తికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. సంగారెడ్డి లోని గీతం యూనివర్సిటీ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నేడు చంద్రబాబునాయుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నేను చాలా యూనివర్సిటీల స్నాతకోత్సవాలకు వెళ్లాను. కానీ ఈరోజు పబ్లిక్ పాలసీ  పై పీజీ చేసిన  విద్యార్థులకు కార్యక్రమానికి వచ్చాను. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

పబ్లిక్ పాలసీ అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. వ్యవస్థల్లో సమూల మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీలు చాలా ఉపయోగపడతాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం పేదరికంతో చాలా ఇబ్బందులు పడింది. అయితే సంస్కరణల తరువాత దేశం ప్రగతి వేగం పెరిగింది. నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంస్కరణలను అమలు చేసి ఫలితాలు సాధించాను.

నేను కొన్ని సార్లు  ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు…కానీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన పాలసీల వల్ల వచ్చిన ఫలితాలు మాత్రం శాశ్వతంగా నిలిచాయి. నాకు ఆ సంతృప్తి ఉంది. నాడు నేను విజన్ 2020 అంటే….420 అని హేళన చేశారు. కానీ గట్టినమ్మకంతో దానికే కట్టుబడి ఉన్నాను. భవిష్యత్ ఊహించి విమర్శలు భరించాను. 25 ఏళ్ల క్రితం నేను విజన్ గురించి ఆలోచించి ప్రణాళిక అమలు చేశాను.

ఇప్పుడు దాని ఫలితమే నేటి ఈ హైదరాబాద్. నాటి విజన్ ఇప్పుడు నిజం అయ్యింది. మన కళ్ల ముందే ఫలితాలుకనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫలితాలు పొందుతున్న వారు నాకు ఓటు వేయకపోవచ్చు…నేను తెలియకపోవచ్చు.  కానీ ఇది నాడు నేనే చేశాను అనే సంతృప్తి  నాకు ఉంది. మరో 25 ఏళ్లలో దేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య దేశంగా అవతరిస్తుంది. గత ఏడాది 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు చేసుకున్నాం. 

2047 సంవత్సరం టార్గెట్ గా దేశం ఒక విజన్ సిద్దం చేసుకోవాల్సి ఉంది. తద్వారా దేశం మంచి ఫలితాలు సాధిస్తుంది. 1978 లో నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రభుత్వం మాకు అప్పట్లో జీపులు ఇచ్చింది. నాటి రోడ్లకు ఆ జీపులే కరెక్ట్ గా ఉండేవి. నాడు ఫోన్, గ్యాస్ వంటి సౌకర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు దేశం ఎంత మారిపోయిందో మనం చూడాలి. ఇది నూతన భారత దేశం. వీటికి కారణం సంస్కరణలే.

సంస్కరణల ముందు…సంస్కరణల తరువాత దేశాన్ని చూడాలి. సంస్కరణల తరువాత దేశ ప్రగతి వేగవంతం అయ్యింది. క్రీస్తు పూర్వం భారత దేశం అతి పెద్ద, బలమైన ఆర్థిక వ్యవస్థ గా ఉండేది. ఇప్పుడు దేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.

ప్రణాళికతో పనిచేయడం ద్వారా 2047 నాటికి భారత దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరిస్తుంది. మన దేశంలో ఉన్న యువత, సాంకేతికత, నిపుణులైన ప్రజల ద్వారా ఇది సాధ్యం అవుతుంది. సంస్కరణల సమయంలో తీసుకువచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ద్వారా త్వరితగతిన ఫలితాలు, మార్పులు వచ్చాయి. అనేక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా  మార్పులు వచ్చాయి.

ఈ విధానంలో తీసుకువచ్చిన మొదటి ప్రాజెక్ట్ హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటీ. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హైదరాబాద్ లో ఇంత వ్యవస్థలను సృష్టించాం అంటే దానికి కారణం పిపిపి విధానం. నాడు విద్యుత్ రంగ సమస్యలపై ఎప్పుడూ చర్చ ఉండేది. అసెంబ్లీలో కూడా ఇదే చర్చ ఉండేది. అయితే ఆ సమయంలోనే ధైర్యంగా పవర్ సెక్టార్ లో సంస్కరణలు అమలు చేశాను.

వీటి కారణంగా నాకు 2004 ఎన్నికల్లో నష్టం జరిగిఉండొచ్చు…కానీ తరువాత కాలంలో దేశం వ్యాప్తంగా వాటిని అనుసరించారు. టెలికాం సెక్టార్ లో మా కమిటీ చేసిన సూచనల అమలు కారణంగా అందరికీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. విమానయాన రంగంలో ఒపెన్ స్కైపాలసీ తీసుకువచ్చి ఆ రంగాన్ని సరళీ కృతం చేశాం. మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్డ్ హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశాం.

5 వేల ఎకరాల్లో నాడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేశాం. నాడు రోడ్లు చాలా దారుణంగా ఉండేవి….నేషనల్ హైవేలు కూడా అలాగే ఉండేవి. అయితే పబ్లిక్ పాలసీ నిర్ణయాల వల్ల రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. ఐటి, బిటి, ఫార్మా, ఫైనాన్స్…ఏ రంగంలో చూసినా పాలసీలతో మార్పులు తెచ్చాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు అతికష్టం మీద బిల్ గేట్స్ అపాయింట్మెంట్ సంపాదించి….ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చాను.

ఎపిలో మైక్రోసాఫ్ట్ పెట్టమని కోరాను. తరువాత సీయాటెల్ కు వెళ్లి కలిశాను…దావోస్ లో కలిశాను. ఇలా విస్తృత ప్రయత్నం ద్వారా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు తీసుకువచ్చాను. ప్రభుత్వ పరంగా కల్పించే వసతులు వివరించి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్ తీసుకువచ్చాను. నాడు మేం ప్రారంభించిన జీనోం వ్యాలీ ద్వారా కోవిడ్ కు వ్యాక్సిన్ వచ్చింది. బలమైన శక్తిగా ఆవిర్భవించే అంశంలో భారత్ కు అనేక అనుకూల అంశాలు ఉన్నాయి.

ఇండియాకు  ప్రధానంగా మూడు అనుకూలతలు ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ. దీనిలో మనల్ని కొట్టేవారు లేరు. రెండోది మనకు ఉన్న యువ శక్తి. దేశ ప్రజల్లో 40 శాతం మంది 25 ఏళ్ల కంటే తక్కువ వయసుఉన్నవాళ్లే. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. యువశక్తితో అద్భుత ఫలితాలు సాధించవచ్చు. మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్. ఈవిషయంలో కూడా తగు మార్పులు చేసుకోవాలి.

పిల్లలు వద్దు అనుకునే విధానాలను వీడాలి. ఇలా మనకున్న అనుకూలతల ద్వారా 2047 నాటికి కార్పొరేట్ అండ్ పబ్లిక్ గవర్నెన్స్ లో ప్రపంచంలో అన్ని చోట్లా ఇండియన్స్ అగ్రస్థానంలో నిలుస్తారు. ఒకప్పుడు మనల్ని బ్రిటీష్ వాళ్లు మనల్ని పాలించారు…..ఇప్పుడు ఆ దేశానికి ప్రధాని మన ఇండియన్ ఇప్పటికి రోజుకు రూ. 150 మాత్రమే సంపాదించేవారు ఉన్నారు. దీన్ని అధిగమించానికి నేను పిపిపిపి అనే విధానం ప్రతిపాదించాను.

పీపుల్, పబ్లిక్, ప్రభుత్వ, ప్రార్టనర్ షిప్ ద్వారా పేదల జీవితాలు మార్చవచ్చు. దీనికి అమారవతి రాజధాని నిర్మాణం ఒక తాజా ఉదాహరణ. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. దీంతో రాజధాని తలపెట్టాం. భూముల ఇచ్చిన రైతులకు రెషిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్స్ ఇచ్చాం. వారికి సంపద వచ్చింది. రాజధానికి నిర్మాణం సాధ్యం అయ్యింది. దేశంలో డిజిటల్ లావేదేవీలు తీసుకువచ్చేందుకు నాడు ప్రతిపాదనలు తెచ్చాం.

ఈవిషయంలో అనూహ్య మైన ప్రగతి ఉంది. రానున్న రోజుల్లో రూ.500, రూ 2000 రూపాయల నోట్లు రద్దు చేయాలి. దీని ద్వారా పొలిటికల్ కరెప్షన్ ను నివారించవచ్చు. ఆర్ధిక వనరులులేకున్నా మంచి పాలసీలతో అద్భుతాలు సృష్టించవచ్చు. దేశంలో ప్రజల మద్య ఆర్థిక అసమానతలు ఇప్పటికీ తీవ్రమైన సమస్యగా ఉంది. ఫ్యామిలీ ఒక యూనిట్ గా మనం పాలసీలు తీసుకురావాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి కుటుంబం లబ్ది పొందుతుంది.

ఇవన్నీ జరగాలి అంటే విజన్ తో పాటుమంచి లీడర్ షిప్ కూడా ఉండాలి. పబ్లిక్ పాలసీలు అనేవి నా హృదయానికి దగ్గర గా ఉండే అంశం. ఇక్కడ చదువుకున్న మీరంతా సమాజంలో మంచి పాలసీలు తీసుకువచ్చి….సమాజంలో మార్పులు తేవాలి.

యువత ఏదైనా సాధించడానికి అవసరం అయిన పరిస్థితులు నేడు ఉన్నాయి. యువత లక్ష్యాలను సిద్దం చేసుకుని ముందు సాగాలి. హార్డ్ వర్క్ ద్వారా విజయాలు సాధించవచ్చు. 2047 నాటికి ఇండియా ప్రపంచ శక్తిగా ఉంటుంది. అందులో అనుమానమే లేదు. ఇక్కడ ఉన్న ఈ విద్యార్థులకు ఆ ఫలితాలు చూస్తారు. కౌటిల్య అనే పేరు పెట్టుకున్న సంస్థలో చదివిన మీరు…ఆ పేరు నిలబెట్టాలి అని అన్నారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మొదటి బ్యాచ్ కు చెందిన 43 మంది పట్టభద్రులకు పట్టాలు పంపిణీ చేశారు.

Related posts

ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Satyam NEWS

ఓటు ద్వారా మోడీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి

Satyam NEWS

రాజ్యాంగ ఉల్లంఘన దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం

Satyam NEWS

Leave a Comment