జగన్ రెడ్డి పాలన బ్రిటీష్ వారిని తలదన్నేలా ఉందని, అసమర్ధ ప్రభుత్వ గొల్లతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే జీవో నెంబర్ ఒకటిని తీసుకువచ్చారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగల రాయుడు అన్నారు. జీవో నెంబర్ ఒకటిని రద్దు చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సందర్బంగా బత్యాల ఆధ్వర్యంలో శనివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు కేకు కోసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బత్యాల మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబును అడ్డుకునేందుకు, వాళ్ల సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలు, పాదయాత్రను, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను అడ్డుకునేందుకే జగన్ రెడ్డి ఈ జీవో ను తీసుకొచ్చారని., హై కోర్టు తీర్పు అధికార వైసీపీ కి చెంపపెట్టు అని అన్నారు.
జగన్ రెడ్డి మాత్రం అనేక సందర్భాలలో అనేక ఉల్లాంఘనలకు పాల్పడ్డారని., జగన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు పాల్పడ్డ అనేక ఉల్లంఘనలకు సంబందించిన ఘటనలను వివరించారు. గతంలో జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా స్వేచ్చగా 3,648 కిలోమీటర్లు, 341 రోజులు పాదయాత్ర చేస్తే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించిందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి నియంతృత్వ ధోరణికి అద్దం పడుతున్న జీవో నెంబర్ ఒకటిని హై కోర్టు రద్దు చేసి మరోసారి మొట్టికాయలు వేసిందని అన్నారు.
ఇప్పటికైనా అడ్డగోలు జీవోలు, అసంభద్ద నిర్ణయాలు మానుకొని ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి పై ద్రుష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య నాయుడు, వెంకటేశ్వర్లు నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు రేవూరి వేణుగోపాల్, భువనగిరి పల్లె తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.