సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పులిచింతల ముంపు గ్రామాల రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు.
రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సమస్యలు ఉత్పన్నమైన పులిచింతల పరివాహక గ్రామలైన వజినేపల్లి,బుగ్గమాదరం గ్రామాలను ఆయన సందర్శించారు.
ముంపుకు గురైన పంట పొలాలను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో వరద తాకిడి ఎక్కువైందని,దానికి తోడు కృష్ణా ఉప్పొంగి ప్రవహించడంతో పులిచింతల ప్రాజెక్ట్ నుండి విడుదల చేసిన నీళ్లు నదిని విస్తరించి పారడంతో పంటపొలాలు ముంపుకు గురి అయ్యాయని అన్నారు.
నదిని వెడల్పు చేయాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని, రైతులకు హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన భూసేకరణ జరుగాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వివరిస్తామని అన్నారు.
గ్రామాల్లో ఎదురౌతున్న విద్యుత్ సమస్యను శాశ్వత పరిష్కారం కనుగొనాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.