టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శనివారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించారు. ఆలయంలో ఏప్రిల్ 2 నుండి 10వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ముందుగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు.
750 కిలోలకు పైగా వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని ఏకాంతంగా నిర్వహించారు. వీటిలో రోజాలు, కనకాంబరాలు, సంపంగి, చామంతి, మల్లెలు, మొల్లలు, తామర, వృక్షి, తులసి తదితర పుష్పాలు, పత్రాలు ఉన్నాయి. సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు పుష్పయాగం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ లోకనాథం, ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.