రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర మంత్రులు నేడు పీవీ నర్సింహారావు గారు పుట్టిన ఇంటిని పరిశీలించారు. ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా పీవీ పుట్టిన ఊరు లక్నేపల్లిని, స్మారక చిహ్నం, వారసత్వ సంపద గా పీవీ పుట్టిన ఇంటినీ, మినీ ట్యాంకు బండ్ గా లక్నేపల్లి చెరువుని తీర్చిదిద్దుతామని మంత్రులు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లు మాట్లాడారు. దేశం గర్వించదగ్గ నేత పీవీ అన్నారు. దక్షిణాది నుంచి ప్రధాని అయిన మొదటి ప్రధాని మాత్రమేగాక, ఒకే ఒక్క తెలుగువాడు పీవీ అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పీవీ మన తెలంగాణ ముద్దు బిడ్డ కావడం, అదీ నర్సంపేటలోని ఈ లక్నేపల్లి లో పుట్టడం ఈ ప్రాంతం చేసుకున్న పుణ్యమన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేసే దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా దేశ సంబంధాలను మెరుగుపరచిన గొప్పవాడన్నారు. అనేక భాషలను నేర్చుకుని మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యాలకు గురి చేసిన మేధావి అన్నారు. ఇంత గొప్ప మేధావికి ఇక్కడి వాడు కావడం మొత్తం తెలంగాణకే గర్వకారణమన్నారు.
పీవీ మన ఠీవీ అంటూ మన ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వ పరంగా పీవీ శతజయంతిని ఏడాదిపాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆయనను గుర్తించి గౌరవించుకోవడం మన విధిగా చెప్పారు. ఇప్పటికే పీవీ దత్తతకు వెళ్ళి వంగర గ్రామంలోని ఆయన ఇంటిని మన వారసత్వ సంపదగా గుర్తించి భద్రపరుస్తున్నామన్నారు. అలాగే పీవీ శతజయంతి ఉత్సవాలలో భాగంగానే ఆయన పుట్టిన లక్నేపల్లి గ్రామాన్ని, పుట్టిన ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచే యోచన సిఎం కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు.
పీవీ కోరుకున్న సంస్కరణలను సిఎం కెసిఆర్ చేసి చూపిస్తున్నారని, అందులో భాగమే చారిత్రాత్మక రెవిన్యూ కొత్త చట్టమని చెప్పారు. పీవీ నర్సింహారావుతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి పీవీ శిశ్యుడన్నారు. తాను మొదటిసారి ఓటమి చెందిన సమయంలో పీవీని తమ తండ్రిగారితో పాటు ఢిల్లీలో కలిశామన్నారు.
అప్పుడు తనను వెన్నుతట్టి ప్రోత్సహించడమేగాక, ఎన్నో సూచనలు చేశారన్నారు. ఆయన హితబోధతోనే నేనిప్పటికీ 40 ఏళ్ళుగా ఓటమి ఎరుగకుండా ప్రజాజీవితంలో ఉన్నానన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, లక్నేపల్లి, నర్సంపేట గ్రామస్థులు, పీవీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.