1వ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టు నిష్ణాతులైన ఉపాధ్యాయులు సంగ్రహణాత్మక పరీక్ష 1 ప్రశ్నాపత్రం వర్క్ షాప్ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా ఉమ్మడి పరీక్షా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డిఈఓ గోవిందరాజులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నాపత్రం తయారీలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రశ్నలను రూపొందించాలని కోరారు. ప్రశ్నలు విద్యార్థులను ఆలోచింపజేసేవిగా వారి సామర్థ్యాన్ని పెంచే విధంగా అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆ విధంగా ప్రశ్నాపత్రం రూపొందించాలని సూచించారు.
9 ,10 తరగతులకు 11 పరీక్షలు బదులుగా 6 పరీక్షలు నిర్వహిస్తున్నందున దానికి అనుగుణంగా ప్రశ్నపత్రాలను తయారు చేయాలని విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని కోరారు.అనంతరం పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. రానున్న పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి రాజ శేఖర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కురుమయ్య, డిసిఇబి సహాయ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, కార్యశాల కు హాజరైన సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.