సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ కె రోజాను ఇరకాటంలో పెట్టేందుకు ‘‘పెద్ద రెడ్లు’’ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దాంతో ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆనందడోలికల్లో మునిగిపోతున్నారు. చిత్తూరు జిలా నగరి ఎమ్మెల్యే రోజాను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఆ జిల్లాకు చెందిన బలమైన నాయకుడు ఒకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా నగరి నియోజకవర్గంలో ఉన్న రెండు మునిసిపాలిటీలలో రెబెల్స్ ను రంగంలో దించారు. ఆమె నియోజకవర్గంలో రెండు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. ఒకటి పుత్తూరు.. మరొకటి నగరి. పుత్తూరులో బహిరంగంగా రెబెల్ పోటీ చేశారు.
ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి నిజమైన వైసీపీ నాయకులును గెలిపించారని రోజా తెలిపారు. పుత్తూరులో మొత్తం 27 స్థానాలు ఉండగా అందులో 21 మంది వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. మరో ఆరు స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కాయి. వైసీపీ రెబెల్స్ ఎక్కడా గెలవలేదు.
దాంతో రోజాకు ఆనందం కలిగింది. అదే విధంగా నగరి లో వైసీపీ 24 స్థానాలలో గెలుపొందగా టిడిపి 4 స్థానాల్లో గెలిచింది. రెండు మునిసిపాలిటీలలో వైసీపీ గెలవడంతో రోజా ఊపిరి పీల్చుకున్నారు.