సూర్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ ఉత్సవంలో నిర్వహించిన వాహనసేవలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించడం విశేషం. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి.
సూర్యప్రభ వాహనం (ఉదయం 5.30 నుండి 8 వరకు) : అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.
ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’
రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టిటిడి శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చదుకుంటున్న 130 మంది విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఐదేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆలపిస్తున్నారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం తదితర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ శ్లోక పారాయణంలో పాల్గొన్నారు.
చిన్నశేష వాహనం (ఉదయం 9 నుండి 10 వరకు) : సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి.
గరుడ వాహనం (ఉదయం 11 నుండి 12 వరకు) : స్వామివారికి ఎన్ని వాహనసేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత చేకూరదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
హనుమంత వాహనం (మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 2 వరకు) : భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగి ఆశీర్వదించాడు.