కర్నూలు జిల్లా లోని ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది క్షేత్రంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం స్వామి అమ్మవార్లు రథోత్సవం పై పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.
ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు, వేదపండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహానంది క్షేత్రం మొత్తం శివ నామస్మరణతో మార్మోగిపోయింది. ఓం నమశ్శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ఆ శివుని నామాన్ని ఉచ్చరిస్తూ రథోత్సవంలో పాలుపంచుకున్నారు.
రాష్ట్రం లోని పలు ప్రాంతాల నుంచి మహానంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల కృప కటాక్షాలు పొందారని ఆలయ పూజారులు తెలిపారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేశారు.