దేవాలయాలపై నిరంతరాయంగా జరుగుతున్న దాడులకు నిరసనగా నల్లబ్యాడ్జి ధరించి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు తెలిపారు.
దేవాలయాల దాడుల అంశంపై సీబీఐ విచారణ అడుగుతుంటే తమ పార్టీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో వీవీఐపీలకు మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందన్నారు.
గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం టీటీడీ బోర్డు చైర్మన్ కు లేదని ఆయన స్పష్టం చేశారు.
సీఎం జగన్ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతున్నట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు. డిక్లరేషన్ విషయంలో చిన్నసంతకంతో పోయే దానికి ఎందుకింత రచ్చ అని వ్యాఖ్యానించారు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
నాపై అనర్హత వేటు వేయించడం సాధ్యంకాదు
రాష్ట్రంలో రైతుభరోసా అమలులో ఆలస్యం జరుగుతోందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. డిమాండ్కి తగ్గట్టుగా రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రజలు తనను బహిష్కరించలేదని, వారధిగా భావిస్తున్నారని చెప్పారు. ఒకట్రెండు నెలల్లోనే తనను పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకుంటున్నానని.. తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.