ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గా ఉన్న దేవేందర్ రెడ్డి.జి తనపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందున తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కోరారు.
ఆయన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీకి ఒక లేఖ రాశారు. దేవేందర్ రెడ్డి చేసిన తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఆయన లేఖ లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వ్యక్తులు ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణా నిబంధనలు ఉల్లంఘించడం కిందికే వస్తుందని ఆయన అన్నారు.
పార్లమెంటు సభ్యుడిపై ఒక ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు. విచారణ జరపకపోయినా, అతడిపై కఠిన చర్యలు తీసుకోకపోయినా ఈ మొత్తం చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఇదే విషయాన్ని తాను పార్లమెంటు ప్రివిలేజి కమిటీ దృష్టికి తీసుకువెళతానని అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు.