ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నా కొన్ని సంస్థలతో కితాబు ఇప్పించుకుని సంతోషపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
శ్మశానాల్లో కూడా రోగులకు టెస్టులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏపీలో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఒకసారి పాలకులు ఆలోచించాలని ఆయన కోరారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అలసత్వం వహించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
విశాఖ ఎప్పుడు వెళ్లిపోదామన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది తప్ప వేరే ఆలోచన లేదని ఆయన విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కరోనాను బాగానే కంట్రోల్ చేస్తున్నారని కానీ ఏపీలోనే పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయన్నారు.
తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి అంటూ రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గ్రామ వాలంటీర్ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని మన పార్టీ నాయకులే సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారు.
నిజంగానే వాలంటీర్లే అంతా బాగా పని చేస్తే కోవిడ్ కేసులు ఎందుకు పెరిగాయి? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థలో వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాల్సి ఉందని ఆయన అన్నారు. ఓ వైపు కోవిడ్తో మనుషులు చచ్చిపోతుంటే.. ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. కితాబు ఇస్తే.. దాన్ని ప్రచురించడం అంత అవసరమా? అని రఘురామకృష్ణంరాజు దుయ్యబట్టారు.