భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని, వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్తో లింక్ చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా 13 వందల 64 కోట్లు వసూలు చేసిందని అందులో ఇప్పటి వరకు 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన అన్నారు.
మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని రఘురామ కృష్ణరాజు లేఖలో కోరారు.