దేశంలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీకి కరోనా వ్యాధి గురించి ఇంకా అర్ధం కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
దేశంలో ఇదే విధంగా వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంటే కరోనా మూడో దశ కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో వచ్చే కరోనా వేవ్ లను అడ్డుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ ఏమీ చేయడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. కరోనా పై సరైన నిర్ణయాలనే తీసుకుంటున్నట్లు ఇంకా ప్రధాని భ్రమలోనే ఉన్నారని ఆయన విమర్శించారు.
దేశంలో వ్యాక్సిన్లు లేకుండా చేసిన ప్రధాని నరేంద్ర మోడీనే సెకండ్ వేవ్ విజృంభించడానికి కారణమని ఆయన అన్నారు.
ప్రధాని బాధ్యతారహితంగా ఆలోచించడం వల్లే దేశానికి ఇంత సంక్లిష్ట పరిస్థితులు దాపురించాయని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం జరుగుతున్న స్పీడ్ లో వ్యాక్సినేషన్ జరిగితే దేశం మొత్తం వ్యాక్సిన్ అందచేయడానికి 2024వ సంవత్సరం వస్తుందని, అప్పటి వరకూ దేశ ప్రజలు పలు రకాల కరోనా వేవ్ లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఇది కోవిడ్ కాదు మోవిడ్ అని ఆయన ప్రధాని మోడీని ఉద్దేశించి అన్నారు. కోవిడ్ అనేది తన రూపు మార్చుకుంటున్నదని తాను ఫిబ్రవరి నుంచి చెబుతున్నా మోడీ పట్టించుకోలేదని రాహుల్ గాంధీ అన్నారు.
అదృష్టం ఏమిటంటే పరివర్తన చెందిన వైరస్ కూడా వ్యాక్సిన్ లకు లొంగుతున్నది. అయితే మూడో వేవ్ ఇంత సరళంగా ఉండదని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ దేశ ప్రధానిలా కాకుండా ‘‘ఈవెంట్ మేనేజర్’’లా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.