రైల్వేరంగ సమస్యల పరిష్కరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాపై తీవ్ర వివక్షచూపుతు మరింత వెనుకబడేలా చేస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిల్కూరి రాంచంద్రారెడ్డి ఆరోపించారు.
గురువారం స్థానిక శాంతినగర్లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఉమ్మడిజిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్తో కలిసి మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే ఒవర్బ్రిడ్జిలేక ఏళ్లుగా ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కట్చేసైనా ఓవర్ బ్రిడ్జిని నిర్మించవచ్చన్నారు. ఏళ్లక్రితం మంజూరైన ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వేలైన్కు చిల్లిగవ్వ ఇవ్వకపోగా సీఎం కేసీఆర్, అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పరిధిలోని కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వేలైన్ రెండేళ్లలోనే పూర్తిచేసి రైళ్లను సైతం ప్రారంభించారన్నారు.
ఆదిలాబాద్ టు హింగన్ఘాట్, ఆదిలాబాద్ టు పటాన్చెరు రైల్వేలైన్లను ప్రకటించిన కేంద్రం వాటిపై ఎలాంటి ఆసక్తి చూపకుండా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. జిల్లా నుంచి ప్రశ్నించే నేతలు కరువయ్యారని అందుకే ప్రభుత్వాలను జిల్లాను లైట్గా తీసుకుంటున్నాయని మండిపడ్డారు.
కరోనా లాక్డౌన్ తర్వాత ప్రారంభమవుతున్న ముంబాయి టు నాగ్పూర్ నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలును తాము చేసిన విజ్నప్తి మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రైల్వే జీఎం అంగీకరించారన్నారు. దీన్ని ఆదిలాబాద్ వరకు సైతం పొడగించారని ఇందుకు పార్టీపక్షాన జీఎంకు కృతజ్నతలను చెబుతున్నట్లుగా వెల్లడించారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజీద్ఖాన్, అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.