మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి, ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో ఉత్తరకోస్తా వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మిగిలిన కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో రుతుపవనాలు మెల్లగా విస్తరిస్తాయి. కానీ, ఈసారి ముందుగా రాయలసీమలో వర్షాలు కురిశాయి.
కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి అధికారులు అంచనా వేశారు. గోదావరి జిల్లాలు, కఅష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు
ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో రుతుపవనాలు మరింత ఉధృతమై మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.