రైతు రుణమాఫీ ఏకకాలంలో చెయ్యకుండా రైతులను ఎగవేతదారులుగా లెక్కకట్టేలా చేసిన వ్యక్తి కెసిఆర్ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు అప్పులపాలు కావడానికి కారణం కెసిఆర్ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా ఆయన నేడు అదిలాబాద్ జిల్లా బొరజ్ గ్రామంలో మాట్లాడారు. మహిళా రుణాల వడ్డీ కట్టకుండా మోసం చేస్తున్న వ్యక్తి కెసిఆర్ అని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఫామ్ హౌస్ లకి రైతుబందు ఇవ్వొద్దు అని చెప్పడం తప్పా ? అని ఆయన ప్రశ్నించారు.
నిజమైన రైతులను మాత్రమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మన బడ్జెట్ ఆకలికి పరిష్కారం చూపే సొమ్ము.. భూస్వాములకు ఇచ్చేది కాదు. పైసలు ఎక్కువ అయితే కౌలు రైతు బంధు రైతులకు ఇవ్వు కానీ భూస్వాములకు కాదు అని మరోసారి చెప్తున్న. ఫసల్ భీమా లేదు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ లేదు, గ్రీన్ హౌస్ కి, డ్రిప్ కి దేనికీ సబ్సిడీ లేదు అన్నీ ఆపి రైతుబందు ఇస్తున్నారని ఈటల అన్నారు.
పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ పథకాలు అన్నీ కలిపి మనకునిచ్చేది 25 వేలకోట్లు.. దానికే మురిసిపోయి ఓట్లు వేస్తున్నాం. కానీ గల్లి గల్లికి బెల్ట్ షాపు పెట్టీ కెసిఆర్ మనదగ్గర గుంజుతున్న డబ్బు 42 వేల కోట్లు. ఎవరు ఎవరికి ఇస్తున్నారు. తాగి తాగి యువకులు చచ్చిపోతున్నారు. ఆడపిల్లల పుస్తెలు తెగిపడుతున్నాయి. పిల్లలు అనాధలు అవుతున్నారు. వీటన్నిటికీ చరమగీతం పాడాలి అంటే కెసిఆర్ ను ఇంటికి పంపించాలి. ఆ సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు.