పవిత్ర పుణ్య క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన క్షేత్రం అయిన శ్రీశైలంలో ముస్లింలు పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది?
దేవాలయాలు కూల్చివేతలపైనా, విగ్రహాలు ధ్వంసంపైనా, రథాలు కాలబెట్టడం పైనా కంటితుడుపు చర్యగా ఆందోళనలు చేసిన ఏపి బిజెపి శ్రీశైలంలో జరుగుతున్న పరిణామాలపై కావాలనే మౌనం వహిస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ బిజెపి నాయకుడు, ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీశైలంలో జరుగుతున్న వ్యవహారాలపై గొంతెత్తి అరుస్తుంటే కనీసం ఏపి బిజెపి నాయకులు మద్దతు కూడా తెలుపడం లేదు.
శ్రీశైలం దేవస్థానంలో ముస్లింల పెత్తనం పెరిగిపోయిందని దీనికి కారణం అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కీలకనేత శిల్పా చక్రపాణి రెడ్డి అని రాజాసింగ్ తీవ్రంగా ఆరోపించారు. జ్యోతిర్లింగ క్షేత్రమే కాకుండా శక్తి పీఠం అయిన శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని రాజాసింగ్ ఆక్షేపించారు.
అక్కడి దేవస్థానానికి చెందిన గోశాలలో ఆవులను మాంసం కోసం చంపుతున్నారని కూడా రాజాసింగ్ ఆరోపించారు. రజాక్ అనే వ్యక్తి శ్రీశైలం దేవస్థానం కాంట్రాక్టు తీసుకున్నారని ఆయన భార్య హిందువు అని రాజాసింగ్ అన్నారు. రజాక్ భార్య ను దేవస్థానంలో సూపర్ వైజర్ గా నియమించారని ఆయన అన్నారు.
రజాక్ అక్కడి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి అత్యంత సన్నిహితుడని కూడా ఆయన తెలిపారు. రజాక్ ఆయన సోదరులు దేవస్థానం వ్యవహారాలను పూర్తిగా అదుపులో ఉంచుకున్నారని ఇది అన్యాయమని రాజాసింగ్ ఆరోపించారు.
రజాక్ సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. దేవస్థానానికి తీసుకువెళ్లే పూల బుట్టలలో గో మాంసం తీసుకెళుతున్నాడని కూడా రజాక్ పై ఆరోపణలు ఉన్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు.
శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో 1,542 ఆవులు ఉండగా ఇటీవల కొన్ని ఆవులను కొందరు చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అనారోగ్యంతో ఆవులు చనిపోవడం సహజమేనని అక్కడి వెటర్నరీ వైద్యులు అంటున్నారు. ఇతర మతస్థులు హిందూ దేవాలయాలలో పని చేయరాదని దేవాదాయ ధర్మాదాయ చట్టం చెబుతున్నా చాలా చోట్ల అన్యమతస్థులనే సిబ్బందిగా నియమిస్తున్నారు.
అందులో శ్రీశైలంలో పెద్ద ఎత్తున అన్యమతస్థులు పని చేస్తున్నారని ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. గతంలో ముస్లింలు ఇక్కడ పని చేయడంపై విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఆందోళనలు జరగలేదు.
తెలంగాణ బిజెపి నాయకుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా ఆంధ్ర బిజెపి నాయకులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసేందుకు ఇష్టం లేకో ఏమో కానీ శ్రీశైలం వివాదాన్ని తలకెత్తుకోవడం లేదు.