రాజస్థాన్లో ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు సచిన్ పైలట్ . అశోక్ గెహ్లాట్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పైలట్ వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. కొత్తగా 15 మంది ప్రమాణం చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య రాజీ కుదిరింది.
సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సంతృప్తిని వ్యక్తం చేశారు సచిన్ పైలెట్. ప్రియాంకాగాంధీ , రాహుల్గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సచిన్ పైలట్ తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 16 నెలల తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది.
పైలట్ వర్గానికి చెందిన రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్ లు తిరిగి మంత్రి పదవులు పొందారు. వీరితో పాటు బ్రిజేంద్ర సింగ్ ఓలా, మేమారన్ చౌదరి, మురీలాల్ మీనాకు మంత్రి వర్గంలో కొత్తగా చోటు దక్కింది.