దేశానికి సాంకేతిక విప్లవం తీసుకువచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ రోడ్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశాడని అన్నారు.
ప్రధానిగా బడుగు ,బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశాడని అన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు , అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చాడని, యువతను సాంకేతిక రంగం వైపు నడిపించాడని చెప్పారు. నిత్యం పేద ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం కాంగ్రెస్ దే
దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. కరోనా నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల కోసం రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయని అన్నారు.
రాజీవ్ గాంధీ హయాంలోనే దేశం పలు రంగాలలో అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబా, బొజ్జ శంకర్ ,జూలకంటి శ్రీనివాస్ రెడ్డి , ఏర్పుల రవి, ఖలీల్ , మందడి శ్రీనివాస్ రెడ్డి , సమద్ ,ఇటికాల శ్రీనివాస్, గడిగ శ్రీనివాస్, జూలకంటి సైది రెడ్డి , ఇంతియాజ్, అల్లి సుభాష్ యాదవ్, గురిజ వెంకన్న గౌడ్, పలువురు సర్పంచులు ,ఎంపీటీసీలు పాల్గొన్నారు.