న్యాయవాది గట్టు వామన్ రావు ఆయన భార్య న్యాయవాది పి.వి.నాగమణి హత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో టీఆర్ఎస్ నాయకుడు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ ఉన్నారు.
వారి నుంచి హత్యకు ఉపయోగించిన నలుపు రంగు బ్రీజా కార్ స్వాధీనం చేసుకున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్ డివిజన్లోని కల్వచర్ల రామగిరి మండలం ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంక్ దగ్గర ఈ దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. వామన్ రావు, నాగమణి హైదరాబాదు నుండి మంథనిలోని న్యాయస్థానంలో ఒక పనికై వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.
గాయపడి రక్తపు మాడుగులో రోడ్డు మీద పడిఉన్న గట్టు వామన్ రావు, కారులో తీవ్రంగా గాయపడి ఉన్న నాగమణిని 108 అంబులెన్స్లో పెద్దపల్లి హాస్పిటల్ కి తరలించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ గాయపడిన వ్యక్తులను పరీక్షించి, వారి పల్స్ రేటు తగ్గుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గాయపడిన వ్యక్తులకు మందులు ఇవ్వడానికి డ్యూటీ డాక్టర్ ప్రయత్నించినప్పుడు, వారు చికిత్సకు స్పందించలేదు. వారు కొంత సమయానికి మరణించారని డ్యూటీ వైద్యులు నిర్దారించారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ రామగుండం ఇన్స్పెక్టర్ లు జి. మహేందర్ రెడ్డి, ఎ. వెంకటేశ్వర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. రాజ్ కుమార్, ఐటి కోర్ టీం ఇన్స్పెక్టర్ జి. నరేష్ కుమార్, రామగుండం సిఐపి టి. కరుంకర్ రావు, సుల్తానాబాద్ సిఐపి ఎ. ఇంద్రసేన రెడ్డి లతో ఆరు బృందాలను ఏర్పడ్డాయి.
ఆరు బృందాలు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తుండగా నిందితులు తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి చంద్రపూర్ ప్రాంతంలో నిందితులు ఉన్నారని పక్కా సమాచారం మేరకు వారిని అరెస్టు చేశారు. న్యాయవాది వామన్రావు, కుంటా శ్రీను ఇద్దరూ గుంజపడుగు గ్రామానికి చెందిన వారేనని ఐదు సంవత్సరాలుగా కోల్డ్ వార్ నడుస్తోందని పోలీసులు తెలిపారు.
న్యాయవాది అయిన వామన్ రావు తన ఎదుగుదలకు అడ్డు వస్తున్నాడని కుంట శ్రీను భావించాడు. గుంజపడుగు లో ఉన్న రామ స్వామి గోపాల స్వామి దేవాలయం మేనేజ్మెంట్ కమిటీ వివాదం ,ఇల్లు నిర్మాణం, కుల దేవత అయిన పెద్దమ్మ ఆలయం నిర్మాణం ఆపడంలో అనవసర లిటిగేషన్లు తో ఆయన ఇబ్బంది పెడుతున్నాడని కుంట శ్రీను భావించాడు.
నేర చరిత్ర ఉన్న కుంట శ్రీను
తట్టుకోలేని కోపంతో ఎలాగైనా వామనరావు ను అంతమొందించాలని కుట్ర పన్నాడు. బిట్టు శీను సహకారం కూడా తోడై ఈ హత్య చేయడానికి త్వరితగతిన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. అనతి కాలం లోనే మండల స్థాయి నాయకుడుగా ఎదిగిన ప్రధాన ముద్దాయి కి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. 1997 సం.లో సికాస లో చాలా ప్రభావశీలమైన సభ్యుడిగా ఉన్నాడు.
బస్సు తగలబెట్టిన కేసులో రిమాండ్ కు వెళ్ళాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి రాజకీయాల్లోకి వచ్చాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు, ఇతర సాక్ష్యాల ద్వారా దర్యాప్తు చేస్తాం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్నా, ఎవరినైనా ఎంతటివారినైనా వదలం అని పోలీసులు తెలిపారు.