ప్రస్తుత రాజకీయాలపై వ్యంగ్య చిత్రం తీసి డబ్బుకు డబ్బు పేరుకు పేరు తెచ్చుకోవాలనుకున్న రామ్ గోపాల్ వర్మకు మరో సారి ఎదురు దెబ్బ తలిగినట్లయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీసి చేతులు కాల్చుకున్న రామ్ గోపాల్ వర్మ మరో ప్రయత్నంగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు టైటిల్ తో మరో రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.
ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ స్టిల్స్, ట్వీట్లతో వేడి తెప్పించారు కానీ చిత్రం చూసిన తర్వాత అసలు ఈ సినిమా ఉనికికే ఎవరూ గుర్తించరు. ఎన్నో వివాదాల తర్వాత నేడు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చింది. సినీ విమర్శకుల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకూ ఎవరూ కూడా ఈ చిత్రం గురించి పాజిటీవ్ గా చెప్పకపోవడం ఒక్కటే ఈ చిత్రం స్పెషాలిటీ.
మీడియాలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషను “పేరడీ” గా తీసుకుని వర్మ (పబ్లిసిటీ కోసం) ఈ సినిమాని నిర్మించారు. ఇది రాంగోపాల్ వర్మ తీసిన మరో చెత్త సినిమా గా చెప్పవచ్చు. పేరడీపై కనీసం శ్రద్ద పెట్టినా కొంచెం బాగుండేది ఈ సినిమా. అయితే అదీ లేదు.
చిత్ర కథ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వెలుగు దేశం పార్టీ పై ఆర్ సి పి పార్టీ ఘన విజయం సాధిస్తుంది. 151 సీట్లతో జగన్నాథరెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. అధికారం కోల్పోయిన వీడీపీ పార్టీ అధినేత బాబు ఆయన తనయుడు చిన బాబు, పార్టీ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలా అని ప్లాన్ చేస్తుంటారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే దయనేని రమ ను హత్య చేస్తారు.
ఈ హత్య ఎవరు చేసేశారు అనేది చెప్పలేదు. కథ సరిగాలేదు. దర్శకుడు సిద్దార్ధ్ తాతోలు పేలవంగా చిత్రాన్ని మలిచాడు. మన సేన అధినేత ప్రణయ్ కళ్యాన్ పాత్రను, స్పీకర్ పమ్మినేతి పాత్రను కామెడీ కోసం వాడుకున్నాడు. మొత్తానికి ఈ చిత్రం ఏ వర్గం ప్రేక్షకుడిని ఆకర్షించే అవకాశం లేదు.