ఆసియా కప్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోవడం ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2022 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి చాంపియన్ గా నిలవగా, మూడోసారి చాంపియన్ కావాలన్న పాకిస్థాన్ కల చెదిరిపోయింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరలేకపోయింది. దీని తర్వాత పాకిస్థాన్ విజయం ఖాయమని భావించారు.
UAEలో టాస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాబర్ టాస్ గెలిచినప్పుడు, పాకిస్తాన్ అభిమానులందరూ తమ దేశం గెలుస్తుందనే అనుకున్నారు. అయితే అలా జరగకపోవడంతో ఆఖరి మ్యాచ్లో పాకిస్థాన్ 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమిని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా కూడా ఒకరు.
పాకిస్థాన్ ఓటమి తర్వాత ఓ భారతీయ జర్నలిస్టు రమీజ్ రాజాను ప్రశ్నించేందుకు ప్రయత్నించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు ఫోన్ను లాక్కున్నారు. పాక్ ఓటమితో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని భారతీయ జర్నలిస్ట్ రమీజ్తో అన్నారు.
ఇది విన్న రమీజ్ రాజాకి కోపం వచ్చింది. మీరు భారతదేశానికి చెందిన వారైతే, మీ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు. ఇలా చెబుతూ ఫోన్ లాక్కుని కింద కొట్టాడు. జర్నలిస్టుతో రమీజ్ రాజా అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ దేశ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అయినా ఇలా చెయ్యడని నెట్టిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.