తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం లకు రంజాన్ బహుమతి ‘రంజాన్ తోఫా’ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మసీద్ నందు సోమవారం స్థానిక తహశీల్దార్ వజ్రాల జయశ్రీ చేతుల మీదుగా నిరుపేద ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వ రంజాన్ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జయశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా రక్కసి విలయ తాండవం చేస్తున్నందున ముస్లిం సోదర, సోదరీమణులు కొవిడ్ నియమ నిబంధనలు తప్పక పాటిస్తూ పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను జరుపుకోవాలని అన్నారు.
మున్సిపాలిటీ చైర్మన్ గెల్లి అర్చన రవి మాట్లాడుతూ మండుటెండలో కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదర,సోదరీమణులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పట్టణ మైనారిటీ కమీటీ అధ్యక్షుడు షేక్ బాజీఉల్లా మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి సారిగా పేద ముస్లీంలు సంతోషకరంగా పండుగ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లు ఇస్తుందని, రాష్ట్రంలో మైనార్టీల కొరకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు యం.డి రహీం, కార్యదర్శి గౌస్ ఖాన్,సభ్యులు గౌస్ ఖాన్,సలావుద్దీన్, ముస్లిం నాయకులు యం.డి నయీమ్, యం.డి షఫీ, యూసూఫ్, అక్బర్, మాజిద్ అలీ, జానిమియా, ఆర్.ఐ సుప్రజ తదితరులు పాల్గొన్నారు.