సిద్ధిపేట జిల్లా చందలాపూర్ రంగనాయక సాగర్ టన్నెల్ పంప్ హౌస్ లోని మూడవ పంపు సెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేడు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సంప్ హౌస్ ను గురువారం సాయంత్రం మంత్రి సందర్శిస్తూ రంగనాయక సాగర్ జలాశయ బండ్ చుట్టూ కలియతిరిగారు.
ఈ మేరకు టన్నెల్ లోని పంప్ హౌస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఇరిగేషన్ ఏస్ఈ ఆనంద్, మెగా ప్రతినిధి ఉమామహేశ్వర రెడ్డి, ప్రజాప్రతినిధులు వేలేటి రాధాకృష్ణ శర్మ, జాప శ్రీకాంత్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి మంత్రి సమీక్షించారు.
నీటి విడుదల పై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో రంగనాయక సాగర్ లో ఇప్పటి దాకా ఎన్ని టీఏంసీ నీళ్లు చేరాయని, ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీళ్లు రావాలంటే ఇంకా ఎన్ని టీఏంసీ నీళ్లు రావాల్సి ఉన్నదని అధికారులతో చర్చించారు. మరో రెండు రోజుల్లో ప్రధాన కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లు రానున్నాయని ఇరిగేషన్ అధికారిక వర్గాలు మంత్రికి వివరించగా, నియోజకవర్గంలోని మండలాల వారీగా ఏ ఏ గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులు ముందుగా నిండనున్నాయనే అంశాలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు.