సీతారామ ప్రాజెక్టు సాగునీటిని రైతుకు అందించాలన్న సంకల్పంతో జరుగుతున్న పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ తమ సిబ్బందితో కలిసి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో జరుగుతున్న రివర్ క్రాసింగ్ పనులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డి గూడెం వద్ద ఆకేరు రివర్ క్రాసింగ్ పనులను, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం గొల్లగూడెం సమీపంలో ఉన్న మున్నేరు క్రాసింగ్ పనులను ఆయన పరిశీలించి పనులు వేగంగా జరపాలని ఆదేశాలు ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే సాగు నీటిని మున్నేరు, ఆకేరు నదుల పై నుండి ఎగువకు పంపించేందుకు వంతెన నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా వాటిని కూడా ఆయన తమ సిబ్బందితో పాటు ఏజెన్సీ ల తో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. పనులు జాప్యం లేకుండా పూర్తిచేయాలని, ఎక్కడ ఏదైనా తేడా వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. శంకర్ నాయక్ వెంట నీటిపారుదల SE రవికుమార్, EE సమీర్ రెడ్డి, DE రమేష్ రెడ్డి తో పాటు ఏజెన్సీ లు, పలువురు సిబ్బంది ఉన్నారు.