కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.
గురువారం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల విక్రయించే వారితో పాటు పలువురు వినియోగదారులతో ఆయన మాట్లాడారు. గతంలో కూరగాయల ధరలకు, లాక్ డౌన్ తర్వాత కూరగాయల ధరలపై ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మార్కెట్ వ్యాపారులు, అసోసియేషన్ అధ్యకుడు సోమయ్యతో మాట్లాడుతూ ప్రతి దుకాణంలో ఒకే విధమైన ధరలు ఉండేలా చూసుకోవాలని, అదే సమయంలో అన్ని షాపుల వద్ద విధిగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. లాక్ డౌన్ ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రకాశం బజార్, కూరగాయల మార్కెట్ లలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని దీని కారణంగా కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలలో విశాలమైన ప్రదేశాలలో భౌతిక దూరం పాటించే విధంగా కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
శుక్రవారం మళ్లీ తాను మార్కెట్ సందర్శిస్తానని అన్ని రకాల జాగ్రత్తలతో విక్రయాలు జరిగేలా చూడాలని డిఐజి సూచించారు. అనంతరం ఆయన ప్రకాశం బజార్ లోని సంఘమిత్ర బ్యాంకును సందర్శించి బ్యాంకు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.
ఉదయం 10.గంటల వరకే బ్యాంకులలో ఖాతాదారులకు సేవలు
లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకులు ఉదయం 10 గంటల వరకు ఖాతాదారులకు సేవలందించాలని 10 గంటల తర్వాత బ్యాంకులలో కేవలం అంతర్గత వ్యవహారాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ బ్యాంకులలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, పోలీస్ సిబ్బంది, కూరగాయల మార్కెట్ వ్యాపారులున్నారు.