రేషన్ సరకులను ఇంటికే చేరుస్తామని చెబుతున్న జగన్ సర్కారు తెల్ల రేషన్ కార్డు దారులకు షాక్ ఇచ్చింది. నూతన సంవత్సరంలో అదనంగా శనగలు, గోధుమలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి రేట్లను మాత్రం బహిరంగ మార్కెట్ తో దాదాపు సమానంగా నిర్ణయించింది.
నవంబర్ వరకు ఉచితంగా ఇవ్వడంతో కందిపప్పు నాణ్యత లేకపోయినా కార్డుదారులు తీసుకున్నారు. అయితే డిసెంబరు నెలలో రేట్లు పెంచడంతో కందిపప్పు కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అంతేగాకుండా చౌక దుకాణాలలో కందిపప్పు నాణ్యత లేదని పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చింది.
ఈ నేపథ్యంలో డీలర్ల వద్ద కందిపప్పు నిల్వలు నిలిచిపోయాయి. ఇదిలా వుండగానే జనవరి నుంచి శనగలు కిలో రూ.42కి విక్రయించాల్సిందిగా పొర సరఫరాల శాఖ ఆదేశాలు జారీచేసింది.
కందిపప్పుకే అమ్మకాలు లేనపుడు శనగలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయించడం కష్టమేనని డీలర్లు చెబుతున్నారు. అంతే గాకుండా బయట మార్కెట్లో శనగల ధర అందుబాటులో ఉండడంతో రేషన్ షాపుల్లో పెరిగిన ధరలకు కొనేందుకు విముఖత చూపే అవకాశం ఉంది.
ఇప్పటికే కొందరు డీలర్ల వద్ద నవంబర్ నెల శనగల నిల్వలు ఉన్నాయి. అవి నాణ్యత లేవని, తమ వద్ద ఉన్న సరుకులు వెనక్కు తీసుకోవాల్సిందిగా డీలర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీపై శనగల అమ్మకాలు ప్రశ్నర్ధకం కానున్నాయి.
నవంబర్ నెల చివరి విడతలో కిలో బియ్యం తగ్గించి గోధుమలు ఉచితంగా పంపిణీ చేశారు. అయితే జనవరి నుంచి కిలో రూ.9 చొప్పున ప్రతి కార్డుదారునికి 5 కిలోల గోధుమలు పంపిణీ చేయనున్నారు. గతంలో కిలో రూ7కి విక్రయించగా ఈ సారి కిలోకు రూ. 2 పెంచారు.
మిగిలిన సరకుల సంగతి పక్కన ఉంచితే కేవలం కందిపప్పు పెంచిన రేటుతో తెల్ల రేషన్ కార్డు దారులపై దాదాపుగా 35 కోట్ల రూపాయల భారం పడుతున్నది. అదే విధంగా గోధమ రేటు పెంచడం వల్ల 15 నుంచి 17 కోట్ల రూపాయల భారం తెల్ల రేషన్ కార్డుదారులపై పడబోతున్నది. మొత్తంగా తెల్ల రేషన్ కార్డు దారులకు జనవరి నెల నుంచి అదనంగా రూ.50కోట్లు అదనపు భారం పడుతుండటంతో వినియోగదారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.