గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో వైస్సార్ నాయకుల రేషన్ మాఫియా మరోసారి భారీగా పట్టుబడిందని తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. గతంలో సుమారు సంవత్సరం క్రితం భారీ మొత్తంలో ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుబడిన నరసరావుపేట రూరల్ పరిధిలోని రావిపాడు రోడ్ లో గల స్వప్న ట్రేడర్స్ లోనే మరోసారి రేషన్ బియ్యం మాఫియాను పట్టుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఇందులో ఉందని ఆయన ఆరోపించారు.
తక్షణమే ఘటనలోని నిందితుల పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని చదలవాడ అరవింద బాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే అవినీతికి అక్రమాలకు మారు పేరు నరసరావుపేటకు చెందిన వైస్సార్ నాయకులని ఆయన అన్నారు. స్వప్న ట్రేడర్స్ ను కేవలం ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నడిపేందుకే తీసుకొని వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన బుచ్చిబాపన్నపాలెంనకు చెందిన వైస్సార్ నాయకులు స్వప్న ట్రేడర్స్ నిర్వాహకులైన ఆవుల శివారెడ్డి,బత్తుల బాలయ్య,లారీ డ్రైవర్ వి.భూపాల్,బి.కిషోర్ లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలోని ఇంకా సూత్ర పాత్రదారులు ఎవరెవరు ఉన్నారో క్షుణ్ణంగా రెవిన్యూ,సివిల్ సప్లయస్ అధికారులు విచారణ చేపట్టాలని 1090 క్వింటాళ్ళ అక్రమ రేషన్ బియ్యం నరసరావుపేట నియోజకవర్గంలోని ఎవరెవరిదగ్గర సేకరించారో రేషన్ డీలర్ల, వైస్సార్ నాయకుల పేర్లను అధికారులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే స్వగ్రామస్థుడైన పుల్లారెడ్డి, అతని అనుచరులు పట్టుబడితే అధికారులు నామమాత్రపు కేసులు నమోదు చేయబట్టే మరలా నిన్న ఇంత భారీ ఎత్తులో అక్రమ రేషన్ వ్యాపారం వైస్సార్ నాయకులు సాగిస్తున్నారని అరవిందబాబు అన్నారు. నిరుపేదల నోటి దగ్గర ముద్ద లాక్కొని ఇలా వ్యాపారం చేయడానికి వైస్సార్ నాయకులు,కార్యకర్తలకు సిగ్గులేదా?అని డా॥చదలవాడ మండిపడ్డారు.
నిజాయితీగల పాలన అందించడం చేతగాకపోతే తక్షణం నరసరావుపేట ఎమ్మెల్యే రాజీనామా చేయాలి గానీ నిరుపేదలు మూడు పూటలా తినే బియ్యం వారికి ఇవ్వకుండా డీలర్ల సహాయంతో వైస్సార్ నాయకులు, కార్యకర్తలు చీకటి మార్కెట్ లో వ్యాపారం చేయడం సిగ్గుచేటని అధికారులు ఈ కేసులో నిందితుల పై గతంలో లాగా నామమాత్రపు కేసులు నమోదుచేసి చీకటి వ్యాపారస్తులకు సహకరిస్తే నిరుపేదలందరితో కలసి టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు.