కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ (పీడీఎస్) బియ్యంను బిచ్కుంద ఎస్ఐ నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తాము పట్టుకున్నామన్నారు. అనంతరం వాహనాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా ప్రక్రియ మండల కేంద్రంలో ఏళ్లతరబడి కొనసాగుతున్నది. అనేక మార్లు బియ్యం రవాణా పట్టుబడినా అధికారులు జరిమానాలు విధించి వదిలేశారే తప్ప చర్యలు మాత్రం తీసుకోలేకపోవడంతో వ్యాపారులు మరింత తమ వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగించారు. కాగా ఈ విషయం రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా తెలుసునని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికారులు మామూళ్ల కే పరిమితం కావడంతో వీరి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది.
బస్టాండ్ ప్రాంతంలోని మూడు నుండి నాలుగు దుకాణాలు ఉనాయంటే ఈ వ్యాపారం ఏ మేరకు కాసులు కురిపిస్తోంది ఆలోచించాల్సిన విషయం. పోలీసులు రంగంలోకి దిగి పట్టుబడడంతో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ఆలోచించదగ్గ అంశం. ప్రతి బుధవారం బస్టాండ్ ప్రాంతంలో యథేచ్ఛగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ అర్ధరాత్రి వేళలో గోడౌన్ల ద్వారా సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పటికే కొన్ని చోట్ల వారి గోడౌన్లలో భారీస్థాయిలో బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం మరి అధికారులు ఇప్పటికైనా మేలుకుంటారు లేదో వేచి చూడాల్సిందే మరి.
జి.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్ నియోజకవర్గం