గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి నరసరావుపేట మండలం, రావిపాడు గ్రామ శివారు లోని స్వప్న రైస్ ట్రేడర్స్ రైస్ మిల్లును తనిఖీ చేయగా భారీ ఎత్తున బియ్యం పట్టుబడ్డాయి. మొత్తం 50 కిలోల బియ్యం ఉన్న 450 బస్తాల PDS బియ్యం గన్నీ గోతాలలో స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా 25 కేజీల బరువు గల 880 బస్తాలు కూడా పట్టుబడ్డాయి. మిల్లు లో తెలుపు ప్లాస్టిక్ గోతాలలో ఉన్న 50 కేజీల బరువు గల 976 బస్తాలు మరియు 25 కేజీలు బరువు తో ఎరుపు రంగు ప్లాస్టిక్ గోతాలలో ఉన్న 630 బస్తాలు మొత్తం మిల్లు లో ఉన్న 645.50 క్వింటాళ్లు కూడా సీజ్ చేశారు. మొత్తం 1090.50 క్వింటాళ్లు బియ్యం(సుమారు 41 లక్షల రూపాయల విలువగల) సీజ్ చేశారు.
నరసరావుపేట తహసీల్దార్ కు జిల్లా ఉన్నతాధికారుల వద్ద నుండి విశ్వసనీయ సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. స్వప్న రైస్ ట్రేడర్స్ మిల్లు యజమాని ఆవుల శివారెడ్డి, మిల్లు గుమస్తా బత్తుల బాలయ్య, లారీ డ్రైవర్ V భూపాల్ రెడ్డి, B. కిషోర్ బాబులపై నిత్యావసర వస్తువుల చట్టం క్రింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.