ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేమిటో గానీ గుంటూరు జిల్లా నకరికల్లు మండలం అధికారులు మాత్రం సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు కదా అని అక్రమార్కులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు.
నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో జరిగే ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు కొందరు యువకులు ఒక నూతన ప్రయత్నాన్ని చేశారు. నాటు సారా, రేషన్ బియ్యం అక్రమ రవాణా లాంటి వాటిపై అధికారులకు సమాచారం ఇచ్చేందుకు ఆ యువకులు ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చే లాక్ డౌన్ రేషన్ అంతా అక్రమదారిలోనే..
లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన రేషన్ బియ్యం పై ఆ యువకులు నిఘా పెట్టారు. సక్రమంగా పంపిణీ అయితే పేదలకు మేలు జరుగుతుందనేది వారి ఉద్దేశ్యం. అయితే అక్రమార్కులు మరో విధంగా అనుకున్నారు.
లాక్ డౌన్ సమయంలో ఇప్పటికి నాలుగు సార్లు రేషన్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే పేదలకు అందకుండా దళారులు ఇటీవల కాలంలో కుంకలగుంట కేంద్రంగా రేషన్ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ యువకులు అధికారులకు సమాచారం ఇవ్వటంతో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
శాసించే స్థాయికి వచ్చేసిన రేషన్ మాఫియా
అయితే ఇప్పుడు రేషన్ మాఫియా దళారులు మరొక అడుగు ముందుకు వేసి రేషన్ ను తరలించేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. రేషన్ తరలించే విషయంలో వారికి ఇబ్బందులు తలెత్తటంతో వారికి అందుబాటులో ఉన్న ముప్పాళ్ళ, ఈపూరు, నకరికల్లు మండలాలకు చెందిన రేషన్ బియ్యాన్ని కుంకలగుంట గ్రామంలో ఉన్న ఒక రైస్ మిల్లుకు పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లుగా గ్రామస్తుల చెబుతున్నారు.
అక్కడ నుండి యథేచ్ఛగా వారికి కావాల్సిన ప్రాంతాలకు తరలిస్తున్నారు. పక్కా ఆధారాలతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ సారి అధికారులు కనీసం దాడి చేసి రేషన్ బియ్యం సీజ్ కూడా చేయలేదు. అధికారులకు చెప్పినా వారు స్పందించకపోవడంతో రేషన్ మాఫియా రెచ్చిపోతున్నది.
అన్యాయాన్ని అదే మని ప్రశ్నిస్తున్న యువకులను తిరిగి వారే బెదిరించే స్థాయికి వచ్చేశారు. రేషన్ మాఫియాపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు.