ఎగువన ఉన్నా, దిగువన ఉన్నా అందరూ రైతులే. ఉన్న నీళ్లను హేతుబద్దంగా సమష్టి నిర్ణయంతో నీటిని వాడుకుందాం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా అందరికి నీళ్లిస్తారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా హరిత హోటల్ నిర్వహించిన సాగునీటి సలహాబోర్డు సమావేశానికి నేడు ఆయన హాజరయ్యారు.
సమావేశానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తోబాటు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యుడు అబ్రహం, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కొల్లాపూర్ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్లు సరిత, స్వర్ణ సుధాకర్ రెడ్డి, గద్వాల కలెక్టర్ శశాంక్, వనపర్తి కలెక్టర్ శ్వేతామొహంతి, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.
ఉమ్మడి జిల్లా తాగు, సాగునీరు అవసరాల మేరకు అవసరమయిన రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనాలను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని, త్వరలోనే అది కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నానని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యేల సూచనలను అధికారులు రికార్డు చేసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. గత పాలకుల దూరదృష్టి లోపంతో రిజర్వాయర్లు నిర్మించకపోవడం పాలమూరు రైతాంగానికి శాపంగా మారిందని, కేసీఆర్ చొరవతో ఆ కొరత తీరిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.