హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తున్నట్టు చెప్పుకునే బిజెపి, తిరుపతి లోక్ సభ టిక్కెట్ ను జగన్ సహ నిందితురాలు రత్న ప్రభకు ఇవ్వడం వెనుక వైకాపా హస్తం ఉందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
జగన్ ప్రమేయంతోనే ఆమెకు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు బిజెపి టిక్కెట్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో పరోక్షంగా వైకాపా గెలుపుకు బిజెపి సహకరించే రాజకీయ కుట్ర ఇందులో దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆర్ ఎస్ ఎస్ భావజాలమున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులుకు టిక్కెట్ ఇస్తారని నిన్నమొన్నటి వరకూ ప్రచారం జరిగిందని ఆయన అన్నారు.
దాసరి శ్రీనివాసులు విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకునిగా పనిచేసారని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలోనూ దాసరి శ్రీనివాసులు ఆర్ ఎస్ ఎస్ సానుభూతిపరునిగా సహకరించారని ఆయన వివరించారు.
ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆయన బీజేపీలో చేరారని, ఇప్పటికి ధర్మ పరిరక్షణ కార్యక్రమాలలో బాధ్యతలు పంచుకుంటున్నారని సుధాకర్ రెడ్డి అన్నారు. పార్టీకి ఇన్నాళ్ల సేవలు అందించిన శ్రీనివాసులును కాదని రత్న ప్రభకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రత్నప్రభ జగన్ తో పాటు సహనిందితురాలు, పైగా కరోనా సమయంలో జగన్ ను ప్రశంసిస్తూ ట్విట్ చేసారు. కరోనా వస్తే పేరాసిటమాల్ వేసుకుంటే చాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే రాదని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఎంను ఆమె ప్రశంసించడం చూస్తే ఆమె సిఎం అభిమానని తేలిపోయింది.
అలాంటి వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం వెనుక జగన్ హస్తం ఉందనడంలో సందేహం లేదు అని సుధాకర్ రెడ్డి అన్నారు. వీరిద్దరితో పాటు జనసేన నాయకులు, కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు టిక్కెట్టు కోసం ప్రయత్నించినా ఆమెనే ఎంపిక చేయడంలో దాగి ఉన్న రాజకీయ కుట్రను ప్రజలు అర్ధం చేసుకోవాలని సుధాకర్ రెడ్డి తెలిపారు.
జగన్ రెడ్డిని, ఆయన అవినీతి కార్యకలాపాలను ఎదుర్కొన్నే శక్తి కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ప్రజలు గుర్తించాలని సుధాకర్ రెడ్డి కోరారు.