28.2 C
Hyderabad
April 20, 2024 13: 00 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్ర గవర్నర్ కు రేవంత్ రెడ్డి ఆవేదనాభరిత లేఖ

RaventhReddyArrest

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం:

ముందుగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ… ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి, నియంత్రణ, ప్రజలకు వైద్యసేవలు అందుతోన్న తీరు పై ఆది నుంచి మీరు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, రోగులకు అందుతోన్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతావైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సైతం సంకోచించని మీ వైఖరి అభినందనీయం. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందనడంలో సందేహం లేదు. ఈ విషయంలో మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ఇక విషయానికి వస్తే…

రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, ప్రజాస్వామిక హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది. పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆవిరైపోయింది. విలువలకు పాలకులు సమాధి కట్టేశారు. కే. చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాక ఓ బందిపోటు ముఠా నాయకుడుగా, ఆధునిక నియంతగా అరాచక పోకడలు పోతున్నాడు. ప్రాథమిక హక్కులు, పౌరహక్కులు, వాక్స్వాతంత్ర్యం, రాజకీయ స్వేచ్ఛ అన్నవి మచ్చుకైనా లేని పరిస్థితి. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ… అక్రమ నిర్భాందాలకు ఒడిగడుతూ మానవహక్కులను సైతం కాలరాస్తున్నారు. పోలీసులను చంద్రశేఖర్ రావు తన ప్రైవేటు సైన్యంగా మార్చివేశారు. పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధించడమే పోలీసుశాఖ పనిగా మారిపోయింది.

నాయకుల ఇళ్ల ముందు నిరంతర నిఘా

ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం, వారి ఇళ్ల దగ్గర నిరంతర నిఘా పెట్టడం, కదలికల పై నిఘా పెట్టడం, ఫోను సంభాషణల పై నిఘా పెట్టడం ప్రభుత్వ అప్రకటిత ప్రాధాన్యం అయింది. ప్రజా ప్రతినిధులమైన మేము స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితి లేదు.

ప్రజలు కష్టాలలో ఉంటే వారిని పరామర్శించే బాధ్యత, వారికి న్యాయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే హక్కు మాకు ఉంది. వివిధ నిరసన పద్ధతుల్లో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే బాధ్యత, హక్కు ప్రతిపక్ష నేతలుగా మాకు ఉంది.

చంద్రశేఖర్ రావు పాలనలో ఇలాంటి హక్కులన్నీ మాటలకే పరిమితం అయ్యాయి. సర్కారుకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటానికి లేదు, తప్పులను ఎత్తిచూపే స్వేచ్ఛ లేదు.

నిరసన తెలిపే అవకాశం కూడా లేదు

ఇది అన్యాయం అని ఎవరూ గొంతెత్తడానికి లేదు.  గతంలో ముఖ్యమంత్రులు సామాన్యులకు అందుబాటులో ఉండేవారు. చంద్రశేఖర్ రావు సీఎం అయ్యాక సామాన్యులకు దర్శన భాగ్యం దేవుడెరుగు… ప్రతిపక్ష నేతలకు సైతం అపాయింట్ మెంట్లు లేవు. ఆయన సచివాలయానికి రారు.

ధర్నానో, నిరసననో చేపట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళదామంటే ధర్నాచౌక్ మూసేశారు. ఇక సామాన్యులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి.

తాజాగా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిన తొమ్మిది మంది సిబ్బంది మృత్యువాత పడిన విషయం మీకు తెలిసిందే. మనుషుల ప్రాణాలతో పాటు, వేల కోట్ల రూపాయల విలువైన జాతి సంపద పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సంకేతాలను హెచ్చరిస్తూ రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారులకు అక్కడ సిబ్బంది సమాచారం పంపారు.

శ్రీశైలం ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యం

సదరు అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు. ఈ ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యం. బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో సైతం ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించలేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం జెన్ కో ఆసుపత్రి ముందు సిబ్బంది ఆందోళన చేశారు.

ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించి, వాస్తవ పరిస్థితిని తెలుసు కునేందుకు నేను, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి ఈ రోజు ఉదయం శ్రీశైలం బయలుదేరి వెళ్లాం. మార్గమధ్యంలో దిండి వద్ద పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు.

సంఘటన స్థలానికి వెళ్లేందుకు గానీ, బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు గానీ అనుమతి లేదన్నారు. ప్రజాప్రతినిధులు గా ఆ కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉందని, పరామర్శకు అనుమతించాలని ఎంతగా విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదు.

అత్యంత పాశవికంగా ప్రవర్తించిన పోలీసులు

అత్యంత పాశవికంగా, మా వాహనాల నుంచి ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు. ఈ రాష్ట్రంలో మా లాంటి ప్రజాప్రతినిధుల హక్కులకే దిక్కులేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా వారిని కలిసి, ధైర్యం చెప్పి, న్యాయం కోసం ప్రశ్నించే హక్కు మాకు లేదా!? వారి తరఫున పోరాడే హక్కు మాకు లేదా?

భారత రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా? రాజ్యాంగ అధినేతగా ఉన్న మీరు సదరు హక్కులకు కాపాడాలని కోరుతున్నాను.

తాజా విద్యుత్ కేంద్ర ప్రమాదంలో మానవతప్పిదం ఉంది. కింది స్థాయి సిబ్బంది హెచ్చరించినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. దీనికి పూర్తిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సంస్థ సీఎండీ ప్రభాకర్ రావులు బాధ్యత వహించాలి. వారిద్దరి పై చర్యలు తీసుకునేలా మీరు ముఖ్యమంత్రిని ఆదేశించాలని సవినయంగా కోరుతున్నాను.

అదే విధంగా ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి. బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. కోవిడ్ పై స్పందిన తీరుగానే ఈ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ఎ రేవంత్ రెడ్డి, ఎంపీ – మల్కాజ్ గిరి

Related posts

హైదరాబాద్‌లో రూ. 80 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Satyam NEWS

భ‌వానీ మాలధారులు బెజ‌వాడ‌కు వెళ్ల‌కుండానే “అమ్మ”‌ ద‌ర్శ‌నం

Satyam NEWS

మండిపడుతున్న గులాబి జెండా ఓనర్లు

Satyam NEWS

Leave a Comment