తెలంగాణ సాయుధ పోరాట యోధుదు, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి 29వ వర్ధంతిని నల్గొండ జిల్లా దేవరకొండలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, రావి చిత్రపటానికి పులమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రావి అగ్రభాగాన ఉండి పోరాటం నిర్వహించాడన్నారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేసి ప్రధానమంత్రికి మించిన ఓట్లు సాధించారని అన్నారు.
రావి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, నేటి యువత రావి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ డిండి మండల కార్యదర్శి బుచ్చిరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు మైనోద్దీన్ పాల్గొన్నారు.
ఇంకా, సీపీఐ నేతలు సుదర్శన్ రెడ్డి, పాండురంగారెడ్డి, వెంకట్రాములు, బుచ్చయ్య, నగేష్, మాధవరెడ్డి, మోహన్ రెడ్డి, జ్యోతిబసు, శ్రీను, నిరంజన్, శేఖర్ రెడ్డి, లాలయ్య, మల్లేష్, నర్సింహారెడ్డి, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.