ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నందున రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు , నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 16 నుంచి 18 వరకు ఈ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అంచనా వేసింది. అదే విధంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో 17వ తేదీ వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణులు చెప్పారు.