జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. హోరెత్తిన మైకులు,నోళ్ళూ మూగబోయాయి. అంతా గప్చిప్ అయింది. పది రోజులుగా రోడ్షోలు, బహిరంగ సభలతో హోరెత్తించిన ఆయా పార్టీలు ఇక ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు దిగేందుకు రెడీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు డబ్బులు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్గా దొరకడం కలవరాన్నే రేపుతోంది.
ఓటరన్నలు ఈసారి ఎవరికి అనుకూలం, వ్యతిరేకంగా తీర్పునివ్వనున్నారనే విషయం 4నే తేలనుండడంతో ఓటింగ్కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండడంతో వీలైనంత మేరకు ఓటర్లకు తాయీలాలు అందించి ప్రసన్నం చేసుకోవాలనే ధ్యాసలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులు ఓ వైపు సిద్ధమవ్వగా, మరో వైపు పోలీసులు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఓటింగ్ రోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం ఐదు గంటల వరకూ క్యూలైన్లలో ఉన్నప్రతీ ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ఎన్నికల కమిషన్ పూర్తి ఏర్పాట్లు
గ్రేటర్ ఎన్నికల్లో 9101 పోలీంగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఇందులో అత్యంత సున్నిత ప్రాంతాలుగా (అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న) 1208 పోలీంగ్ కేంద్రాలుగా గుర్తించింది. మరో 2336 సున్నిత ప్రాంతాలుగా గుర్తించింది. కోవిడ్ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
పోలింగ్ ఏర్పాట్లు అధికారుల తలమునకలు
పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. పోలింగ్ సిబ్బంది 36,604 మంది, పోలీంగ్ అధికారులు 9101, సహాయ పోలింగ్ అధికారులు అదే స్థాయిలో 9101, ఇతర సిబ్బంది 18,202, రిటర్నింగ్ అధికారులు150, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 150 మంది, వెబ్కాస్టింగ్ పోలీంగ్ కేంద్రాలు 2277, సాధారణ పరిశీలన సిబ్బంది 14, వ్యయ పరిశీలకులు 34, అబ్జర్వర్లు, 1729, సెక్టోరియల్ అధికారులు 660 ఫ్లయింగ్ స్క్వాడ్ 60, సర్వేలెన్స్ 30, మొత్తం బ్యాలెట్ బాక్సులు 28683 గా ఏర్పాట్లు చేపట్టారు. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ ఈసారి పోలింగ్కు కోవిడ్ నేపథ్యంలో భిన్నమైన ప్లాన్ను అమలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి డివిజన్ల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఉన్నతాధికారులు రెడీ అయ్యారు.
డివిజన్లు, అభ్యర్థులు
150 డివిజన్లకు గానూ 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, మజ్లీస్ 51, సీపీఐ-సీపీఎంలు 17-12, ఇతర పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్ర్య అభ్యర్థులు 415 మంది రంగంలో ఉన్నారు.
భద్రతా ఏర్పాట్లలో పోలీసులు..
ఇప్పటికే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్లపై పోలీసులు ఓ నజర్ వేశారు. అల్లర్లు చెలరేగే ప్రాంతాలపై నిఘా ముమ్మరం చేశారు. ఇప్పటికే 600 మందిని బైండోవర్ చేశారు. ఇక మొత్తం బందోబస్తుకు 50వేల పైచిలుకు పోలీసులతో భద్రతను కల్పిస్తున్నారు. ఇందులో 15 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 15 స్ర్టైకింగ్ ఫోర్స్, 116 స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్,, మొబైల్ పార్టీలు 406, నగర సరిహద్దులో 44 చెక్పోస్టులు, అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మకమైన చోట్ల 293 పికెట్ల ఏర్పాటు, దర్యాప్తు బ్రందాలు 34, ఇక అన్ని పోలీంగ్ స్టేషన్లకు జీయో ట్యాగింగ్. ఆయా టీమ్లను పరితీరును పరిశీలిస్తూనే వారికి పోలీంగ్ స్టేషన్ల వద్ద భద్రతా తదితర విషయాలను ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసేలా ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
ఈసారి పోలీసులు భద్రతా విధుల్లో వినూత్నమైన టెక్నిక్ను అనుసరిస్తున్నడానికి ఇదే నిదర్శనం. సమయాలు మార్చి అకస్మాత్తు తనిఖీలు పెంచేందుకు ఏర్పాట్లు, మఫ్టీ సిబ్బంది, ఇంటలిజెన్స్ సిబ్బందితో ఆయా చోట్ల అభ్యర్థలపై నిఘా, నగరంలోని పలు లాడ్జీలు, హోటళ్లపై నిఘా ముమ్మరం చేశారు. పోలీంగ్ ఏజెంట్ల వివరాలను కూడా ఆరా తీసి అందుబాటులో ఉంచుకున్నారు.
ఓటింగ్ సరళి
ఓటర్లు కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక లైన్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా 21 గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా అనుమతి, వ్రద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు, వీల్ చైర్ల ఏర్పాటు, సహాయకుల ఏర్పాటు, శానిటైజర్ బాటిళ్లు,పీపీఈ కిట్లు150 డివిజన్లలో ఫేస్ రికగ్నైజేషన్ పద్ధతులను పాటించనున్నారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను అనుమతించరు.