ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రియల్ టైమ్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ (ఆర్ టిపిఎమ్ఎస్) ప్రాజెక్ట్ కు ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పలు సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నది. ఈ సంస్కరణల్లో ఒకటి రియల్ టైమ్ కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థ (RTPMS). ఈ వ్యవస్థను అమలు చేయడం ద్వారా కాలుష్య యూనిట్లను పర్యవేక్షిస్తోంది.
ఏదైనా పరిశ్రమ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ SMS అలర్ట్ వస్తుంది. దీనిపై తక్షణ చర్యలను తీసుకునేందుకు స్థానిక అధికారులు వెళతారు. ప్రమాణాలు పాటించని పరిశ్రమలకు నోటీసులు జారీ చేస్తారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ అవార్డు ప్రకటించడంతో నేడు ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో APPCB సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మార్గదర్శనంతో ఈ ప్రాజెక్టును అమలు చేశామని అన్నారు. ఈ వ్యవస్థతో పర్యావరణ పరిరక్షణ పూర్తి స్థాయిలో జరిగిందని ఆయన అన్నారు.