వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- తండ్రి పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్న పార్టీ పేరుపై ఇప్పుడు తిరుగుబాటు ఎంపి కె.రఘురామకృష్ణంరాజు రేపిన అంశాలు మొదటికే మోసం తెచ్చేలా కనిపిస్తున్నాయి. వాడుక భాషలో ఎలా ఉన్నా పార్టీ రిజిస్టర్ చేసుకున్న సందర్భంలో ఇచ్చిన పేరుపై ఇప్పుడు రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన అభ్యంతరాలు కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి లేఖ రాయడంతో సరిపుచ్చలేదు.
ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో ఇప్పుడు ఎంపి తిరుగుబాటు అంశం జాతీయ స్థాయిలో పార్టీ పేరుపై చర్చకు దారి తీస్తున్నది. ఇది కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. వై ఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ అని అర్ధం వచ్చే విధంగా పెట్టుకున్న ఈ పార్టీ పేరు వాస్తవంగా ఎన్నికల కమిషన్ రికార్డుల మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.
ఇదే విషయాన్ని రఘురామకృష్ణంరాజు లేవనెత్తారు. తనకు న్యాయబద్దంగా షోకాజ్ నోటీసు పంపిన లెటర్ హెడ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని ఇది అసలుకే న్యాయబద్దంగా లేదని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన పేరు కాకుండా తనకు బిఫారం ఇచ్చిన పార్టీ పేరుతో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో లేఖ పంపడమే న్యాయ సమ్మతంగా లేదని ఆయన అంటున్నారు.
తనకు తెలిసినంత వరకూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మార్చిన దాఖలాలు లేవని ఆయన కొత్త అంశం తెరపైకి తెచ్చారు. ఇది చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. తనపై పార్టీ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం అటుంచి రఘురామకృష్ణంరాజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలు లేవనెత్తుతారని ఎవరూ ఊహించలేదు. ఈ పరిస్థితి నుంచి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపడటాటనికి ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది.