తిరుపతి, నంద్యాల జిల్లాలలో 31ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. టాస్క్ ఫోర్సు హెడ్, కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ మేడా సుందరరావు అధ్వర్యంలో, డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో రిజర్వు ఇనస్పెక్టరు (ఏఆర్)కు చెందిన టీమ్ లు బుధవారం చంద్రగిరి, నంద్యాల జిల్లా నాగులాపురం అటవీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని తెలిపారు. చంద్రగిరి సఃమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతం సచ్చినోడిబండ వద్ద దుంగలను మోసుకుని వెళుతున్న స్మగ్లర్లను చుట్టుముట్టారు.
దుంగలు పడేసి వారిలో కొందరు పారిపోగా, వేలూరు, జవ్వాదిమలైలకు చెందిన ఆర్. సెల్వరాజ్, కుమార్ లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆప్రాంతంలో 19ఎర్రచందనం దుంగలను లభించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదే వి ధంగా మరో టీమ్ నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం నాగులాపురం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న స్మగ్లర్లను చుట్టుముట్టినట్లు తెలిపారు. వారిలో అదే ప్రాంతానికి చెందిన ఇసుకపల్లి లింగమయ్యను అరెస్టు చేసి, రెండు మోటారు సైకిళ్లు, 12ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండు కేసులను టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనులో కేసులు నమోదు చేశారు. పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్లు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.