తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు, ప్రముఖులు చేపడుతున్నఅవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. అంతేగాకుండా ప్రజలు కూడా మునుపటి విషయాలను జ్ఞప్తిలో ఉంచుకొని వైద్యుల, సూచనలు, సలహాలు పాటిస్తుండడంతో కేసులు తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 491 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. తాజాగా.. 596 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జి అయ్యారు. 7,272 కేసులు యాక్టివ్ కేసులున్నాయి. మరో 5,169 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1499కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.85శాతంగా ఉందని, మరణాల రేటు 0.53శాతంగా ఉందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 48,005 రక్త నమూనాలను పరిశీలించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
కాగా తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు హైకోర్టు ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు, ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన విషయం విదితమే. కేసుల నిర్ధారణ పూర్వాపరాల వివరాలకు ఎప్పటికప్పుడు కోర్టుకు అందజేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.