నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 556 అడుగులు ఉంది కాబట్టి, కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులకు ఖరీఫ్ లో వరి పంట వేసుకునే అవకాశం వెంటనే కల్పించాలని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఆగస్టు నెలలో ఉన్నాం కాబట్టి, నార్లు పోసుకోవటం లేట్ అయిపోయిందని ఆయన అన్నారు. వెంటనే నీటిని విడుదల చేసి నార్లు పోసుకుని, నాట్లు వేసుకోవడానికి అవకాశం కల్పించినట్లయితే రైతులకు కొంత, గత సంవత్సరం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
గత సంవత్సరం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక మిర్చి పంటని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందని, అలాగే ప్రత్తిని కొనేవాళ్ళు ఎవరూ లేక తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.
సీసీఐకి అమ్ముదామని వెళితే అక్కడ అధికార పార్టీ ధన దాహం వల్ల క్వింటాకి 25 కేజీల ప్రత్తిని కట్ చేసి, రైతులను నిలువు దోపిడీ చేశారని ఆయన అన్నారు. వరిధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రాలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయల పంట నిధిని కేటాయించి, రైతులు పండించిన పంటని పొలాల్లోకి వెళ్లి కొంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
ఇప్పటికైనా రైతుల దగ్గర నుండి మిగిలిపోయిన పంటని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం పండించే పంటని తెలంగాణ ప్రభుత్వం లాగా మనకు కూడా పంట నిధిని ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.