శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా సంవత్సర కాలంలో టీటీడీ కి 100 కోట్ల ఆదాయం రావడం శ్రీవారి పై భక్తులకు ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీవారి భక్తుల నమ్మకాన్ని విశ్వాసాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తూ శ్రీవారి సన్నిధిలో శ్రీవాణీ ట్రస్టు టికెట్ పొందిన భక్తులకు కనీసం “హారతి” సైతం ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ ధర ఒక్కరికి 10,500 తీసుకుంటున్నారని, మొదట ప్రకటించిన దానికి భిన్నంగా శ్రీవారి సన్నిధిలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల టీటీడీ అధికారులు తమ నిర్ణయంపై పునః పరిశీలించి భార్య భర్తలను లేక కనీసం ఇద్దరిని దర్శనానికి అనుమతించేలా బోర్డు సమావేశంలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టలేక శ్రీవాణి ట్రస్టు 10,500 రూపాయల దర్శనం టిక్కెట్ ప్రవేశ పెట్టాం అని చెప్పడం హాస్యాస్పదం, కొండపై ఇప్పటికీ చలామణి అవుతున్న “వైట్ కాలర్ దళారీల” పై దృష్టి పెట్టండని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.
ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో తెలుగు రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెబుతున్న టీటీడీ మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాలను రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి వారి మెప్పు కోసం టిటిడి లో విలీనం చేసుకోవడం పై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు.
నిధులను అవసరమున్న చోట మాత్రమే ఆలయాలు నిర్మించి మిగిలిన నిధులను టిటిడి ఉద్యోగస్తులు,భవిష్యత్ ధార్మిక కార్యక్రమాల కోసం టీటీడీ “కార్పస్ ఫండ్” లో జమ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ట్రస్ట్ టిక్కెట్ల అమ్మకం ద్వారా టీటీడీ కి వచ్చిన100 కోట్ల ఆదాయంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఖర్చు పెట్టే ప్రతి పైసాకీ జవాబుదారితనంగా ఉంటూ శ్రీవారి భక్తులకు తెలిసేలా “శ్వేతపత్రం” విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.